calender_icon.png 20 September, 2024 | 8:10 AM

ఆ ఐదుగురు గ్యాంగ్‌స్టర్లు

17-09-2024 03:21:44 AM

  1. ఉత్తర భారతంలో హత్యలు, దాడులు 
  2. ఇటీవల ఢిల్లీలో ఓ జిమ్ ఓనర్ హత్య 
  3. ఈ గ్యాంగ్‌స్టర్లపై పోలీసుల నిఘానేత్రం

న్యూఢిల్లీ, ఉత్తరభారత దేశంలో ప్రతి దశాబ్దానికి ఒకరిద్దరు గ్యాంగ్‌స్టర్లు పుట్టుకొచ్చి కొంతకాలం తీవ్ర అలజడి సృష్టించటం ఆనవాయితీ. బలవంతపు వసూళ్లు, దాడులు, హత్యాయత్నాలు, హత్యలతో ప్రజలను హడలగొడుతుంటారు. చివరకు పోలీ సుల తూటాలకు బలవ్వటమో.. జైల్లో ఊచ లు లెక్కపెట్టడమో చేస్తుంటారు. ఈసారి కూడా ఢిల్లీ, రాజస్థాన్, యూపీ ప్రాంతాల్లో ఐదుగురు గ్యాంగ్ స్టర్లు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రము ఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై దాడిచేసిన లారెన్స్ బిష్నోయ్ అనే గ్యాంగ్‌స్టర్ ఇటీవల దేశం దృష్టిని ఆకర్షించారు. తాజాగా దేశ రాజధానిలోని ఖరీదైన ప్రాంతమైన గ్రేటర్ కైలాష్ పార్ట్ 1లో ఉండే జిమ్ ఓనర్ నాదిర్‌షాను దుండగులు కాల్చిచంపారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఐదుగురు గ్యాంగ్‌స్టర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధంచేసినట్టు తెలిసింది. ఆ గ్యాంగ్‌స్టర్లు ఎవరో చూద్దాం..

లారెన్స్ బిష్నోయ్: ఇతడు ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. బిష్నోయ్ గ్యాంగ్‌లో 700 మంది షూటర్లు ఉన్నట్టు సమాచారం. ఇతడి మనుషులే ఇటీవల ముంబైలోని సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపారు. ఇతడు ఆకు రౌడీగా ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించాడు. 2022లో పంజాబ్ గాయకుడు సిద్దు మూసేవాలాను హత్య చేసింది కూడా ఇతడి గ్యాంగే. ఇటీవల నాదిర్‌షా మిత్రుడైన కునాల్ ఛబ్రాను బిష్నోయ్ రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. ఆ విషయం తెలుసుకొన్న నాదిర్‌షా తనకు ఎంతోమంది పెద్దపెద్ద పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు తెలుసని.. బిష్నోయ్‌కి ఒక్క పైసా ఇవ్వొద్దని కునాల్‌కు సూచించాడు. దీంతో లారెన్స్ బిష్నోయ్ నాదిర్‌షాను టార్గెట్ చేసి చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

రోహిత్ గోదర: ఇతడు లారెన్స్ బిష్నోయ్‌కి సన్నిహిడుతు. ఇతడి స్వస్థలం రాజ స్థాన్. కానీ అమెరికాలో నివసిస్తుంటాడని భావిస్తున్నారు. 2023లో జైపూర్‌లో కర్నిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని ఆయన ఇంట్లోనే కాల్చి చంపటంతో ఇతడి పేరు బాగా పాపులర్ అయ్యింది. అమెరికాలో ఉన్నా భారత్‌లోని వ్యాపారులకు నేరుగా ఫోన్లు చేసి కోట్లకొద్ది డబ్బు ఇవ్వాలని బెదిరిస్తాడని పోలీసులు తెలిపారు.

రణ్‌దీప్: ఇతడిది ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్. ఇతడు కూడా అమెరికాలోనే ఉంటూ తన మనుషులతో భారత్‌లో దందాలు చేస్తున్నాడు. నాదిర్‌షాను చంపటంలో ఇతడు కూడా సహాయం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

హషీమ్ బాబా: ఇతడు ఈశాన్య ఢిల్లీకి చెందిన గ్యాంగ్‌స్టర్. 2020లో ఇతడితో పోలీసులకు ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకొన్నప్పటికీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతడిని స్థానికంగా డాన్ ఆఫ్ యమునాపర్ అని పిలస్తారు. సిద్దూ మూసేవాలాను హత్యచేయటంతో ఇతడు లారెన్స్ బిష్నోయ్ మను షులకు సహకరించాడని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి జైల్లోనే ఉన్నప్పటికీ తన మనుషులతో దందాలు చేస్తూనే ఉన్నాడు. తన శత్రువులైన దక్షిణ ఢిల్లీలోని గ్యాంగ్‌స్టర్లు రవి గంగ్వాల్, రోహిత్ చౌదరితో నాదిర్‌షా సన్నిహితంగా మెలగటంతో అతడిని చంపటానికి ఈ గ్యాంగ్‌స్టర్ కూడా సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. 

కునాల్ ఛబ్రా: ఇతడే నాదిర్‌షా మిత్రుడు. దుబాయ్‌లో ఉంటున్నాడు. భారత్‌లో ముఖ్యంగా ఢిల్లీలో లెక్కలేనన్ని చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నాడు. పదుల సంఖ్య లో అనుమతి లేని కాల్‌సెంటర్లు నిర్వహిస్తూ ప్రజలు దోపిడీ చేస్తున్నాడు. తన నేరాలు కప్పిపుచ్చుకొనేందుకు పోలీసులతోపాటు చిన్నచిన్న నేరగాళ్లకు భారీ మొత్తంలో మా మూళ్లు ఇస్తుంటాడని ప్రచారంలో ఉన్నది.