27-03-2025 01:50:09 AM
న్యూఢిల్లీ, మార్చి 26: మహిళల వక్షోజాలను తాకడం, ఆమె పైజామాను లాగడం అత్యాచార నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ‘న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏ మాత్రం సున్నితమైనవి కావు. అవి అమానవీయంగా ఉన్నాయి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులిచ్చింది.
కేసు వివరాలివే..
యూపీలోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పవన్, ఆకాశ్ ఓ మైనర్ బాలిక వక్షోజాలను తాకడం, ఆమె పైజామాను పట్టి లాగడం చేశారు. అంతే కాకుండా ఆమెను కల్వర్టు కిందకి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రా మ్ మనోహర్ తీర్పునిస్తూ ‘మహిళ వక్షోజాలను తాకడం, దుస్తులను లాగడం అ త్యాచారం లేదా అత్యాచార యత్నం కింద కు రాదు’ అని వెల్లడించారు.