- దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుంది
- బడ్జెట్పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. దేశ పురోగతికి దోహదపడే బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని ఆమె బృందాన్ని ప్రధాని అభినందించారు. ‘భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుంది.
ఇది ప్రజల బడ్జెట్. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెలవేర్చే విధంగా ఉంది. అనేక రంగాల్లో యవతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్లు సాధారణంగా ప్రభుత్వ ఖజానా నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించింది. ఈ బడ్జెట్లో రూ.12లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని అన్నారు.