calender_icon.png 20 September, 2024 | 9:17 PM

ఉగ్రవాదానికి ఇదే తుదిశ్వాస

15-09-2024 05:35:40 AM

  1. కశ్మీర్ లోయకు పూర్వవైభవం తీసుకొస్తాం
  2. ఇక అప్రకటిత కర్ఫ్యూలు ఉండవు
  3. వారసత్వ నేతలు ఈ ప్రాంతాన్ని నాశనం చేశారు
  4. యువ నాయకత్వానికి ఆహ్వానం పలుకుతున్నాం
  5. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 14: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అత్యంత అందమైన కశ్మీర్ లోయను నాశనం చేసిన వారసత్వ రాజకీయాలను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం కొత్త నాయకత్వాన్ని ఆశిస్తోందని వెల్లడించారు. జమ్ము ప్రాంతంలోని దోడా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

అంతేకాకుండా పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కశ్మీర్ లోయకు పూర్వ వైభవం తీసుకొస్తామని, అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు పోయాయని చెప్పారు. జమ్ముకశ్మీర్ యూటీలో తొలి విడుతలో భాగంగా సెప్టెంబర్ 18న 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

యువ నాయకత్వం రావాలి

జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొనడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా వివాదాస్పద కశ్మీర్ లోయలో ఓ ప్రధాని పర్యటించడం గత 42 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు జమ్ముకశ్మీర్ భవిష్యత్తు ను నిర్ణయిస్తాయి. స్వాతంత్య్రం నాటి నుంచి కశ్మీర్‌ను లక్ష్యంగా విదేశాలు ఎంచుకున్నాయి. అంతేకాకుండా వారసత్వ రాజకీయాలు ఈ అందమైన ప్రాం తాన్ని నాశనం చేశాయి. మీరు నమ్మిన రాజకీయ పార్టీలు మీ పిల్లల గురించి ఆలోచించ లేదు. వారి పిల్లల భవిష్యత్తు గురించి కష్టపడ్డారు.

ఇక్కడ ఎలాంటి నాయకత్వాన్ని వాళ్లు అంగీకరించలేదు. కశ్మీర్ లోయ లో యువ నాయకత్వం రావాలి. ఈ లక్ష్యాన్ని మేము 2014లో అధికారంలోకి రాగా నే నిర్దేశించుకున్నాం. ఇక్కడి యువత ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించకుండా కొత్త నాయకులు పుట్టుకురావా లి అని మోదీ పిలుపునిచ్చారు. 2000 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగలేదని, కొత్త నేతలకు అవకాశం రాలేదని మోదీ అన్నారు. 

ఇక ఆ రోజులు రావు

ఇందుకోసమే కశ్మీర్‌లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించినట్లు మోదీ చెప్పారు. ఆ తర్వాతే వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, అక్కడ ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో లాల్‌చౌక్‌కు వెళ్లాలంటే భయపడేవారని, కాంగ్రస్ హయాం లో కేంద్ర హోంమంత్రి సైతం అక్కడికి వెళ్లలేకపోయారని మోదీ ఆరోపించారు. ఇక మీదట ఆ రోజులు పునరావృతం కావని అన్నారు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్‌లో కేంద్రం ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మోదీ వెల్లడించారు. పలు హామీలను ప్రకటించారు. 

లోయలో ఉగ్ర కలకలం

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కిష్టార్, ఉదంపూర్, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను భద్రతా బలగాలు పెంచా యి. శుక్రవారం కిష్టార్, కథువా జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతమయ్యారు.

ఈ ఆపరేషన్లలో నలుగురు సైనికులు సైతం గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో  సెప్టెంబర్ 18న తలి విడుత పోలింగ్ జరగనుంది. చీనాబ్ నది లోయలోని కిష్టార్, రాంబస్, దోడాతో పాటు దక్షిణ కశ్మీర్ జిల్లాల్లోని మొత్తం 24 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. 

విదేశాల్లో భారతీయునికి కాంగ్రెస్ అవమానం 

కాంగ్రెస్ నోరు తెరిస్తే ప్రేమ దుకాణం అంటోందని, కానీ బయట మరోరకంగా ప్రవర్తిస్తోందని మోదీ మండిపడ్డారు. అమెరికాలో వీళ్లు ఏం చేశారు? ఓ జర్నలిస్టుపై కిరాతకంగా దాడి చేశారు. అతనికి విదేశంలో తీవ్ర అవమానం జరిగింది. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వాళ్లు నిజానికి అవతలివాళ్ల నోరును మెదపనివ్వట్లేదు. ప్రశ్నిస్తే దాడు లు చేస్తూ పేట్రేగిపోతున్నారు అని మోదీ ఆరోపించారు.

ఇటీవల డల్లాస్‌లో కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడాను ఇంట ర్వ్యూ చేసే క్రమంలో బంగ్లాలో హిందువుల భద్రత గురించి ఓ మీడియా సంస్థ కరెస్పాండెంట్ రోహిత్‌శర్మ ప్రశ్నించగా.. పిట్రోడా అనుచరులు రోహిత్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతని ఫోన్ లాక్కొ ని, ఇంటర్వ్యూ వీడియోను డిలీట్ చేశారు. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు 3 రోజుల ముందే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.