09-02-2025 12:00:00 AM
గోండురాజుల గాంధారి వెయ్యేండ్ల చరిత్ర ఉన్నది. దీన్ని కాకతీయుల కాలంలో గోండు రాజులు కట్టించారని చెబుతారు. పెద్ద ఇసుక రాళ్ల మీద కట్టిన ఈ కోటను ఎక్కి చూస్తే, పచ్చని చెట్లు కనిపిస్తాయి. రెండేండ్లకు ఒకసారి ఇక్కడ జరిగే మైసమ్మ జాతర చాలా ప్రసిద్ధి. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ఉన్న బొక్కలగుట్ట ఊర్లో ఉంది ఈ కోట.
గోండు రాజుల నుంచి ఈ కోటని ఒడ్డి రాజు అనంతరాజు సొంతం చేసుకున్నట్టు అతడి పేరు మీదున్న శాసనంలో ఉంది. కోట ప్రధాన ద్వా రం దగ్గర ఉన్న తోరణం, కోటలోని శిల్పాలు కాకతీయుల శిల్పకళని కళ్లకు కడతాయి. ఇక్కడ ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న పది తలల నాగశేషుడి విగ్రహం ఉంది.
దీన్ని ఒకే రాయి మీద చెక్కడం విశేషం. రాళ్ల గోడల మీద చెక్కిన కాలభైరవుడు, శివుడు, గణపతి, ఆంజనేయుడి విగ్రహాలను చూడొచ్చు. ప్రతి విగ్రహం పక్కన శంఖువు, చక్రం బొమ్మ ఉంటుం ది. దాంతో ఈ కోటని విష్ణువు.. శివుడికి అంకితం చేసినట్టు చెప్తారు చరిత్రకారులు. ఇక్కడ మూడు బావులు ఉంటాయి.
వీటి స్పెషాలిటీ ఏంటంటే.. ఎండాకాలంలో నూ వీటిలో నీళ్లు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ‘ఏనుగుల బావి’ ఉంది. ఏనుగులు, గుర్రాలు ఇక్కడికి వచ్చి నీళ్లు తాగేవట. గాంధారి కోట మీదకు వెళ్లే దారంతా పెద్ద చెట్లతో అడవిని తలపిస్తుంది. ఇందులో కొన్ని రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతాన్ని ‘మెడిసినల్ ప్లాంట్స్ కన్జర్వేషన్ సెంటర్’గా ప్రకటించారు.
మైసమ్మ జాతర
గాంధారి మైసమ్మ గుడి ఉంది. ఇక్కడ రెండేండ్లకు ఒకసారి మాఘమాసంలో అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మైసమ్మ తల్లికి పూజలు చేసి, మొక్కులు చెల్లించేందుకు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి గిరిజనులు భారీగా వస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆదివాసీలు ఈ జాతర చూసేందుకు వస్తారు.