19-03-2025 11:37:20 PM
మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య..
కాటారం (విజయక్రాంతి): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ను బడుగుల బతుకులు మార్చేదిగా ఉన్నదని కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య అభివర్ణించారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చిహ్నంగా ఉందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ అక్షరాల మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజోపయోగ కార్యక్రమాలను తీర్చిదిద్దే విధంగా ఉందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా పేద ప్రజల సంక్షేమంకై ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం మొదటిసారని కొనియాడారు. ఈ బడ్జెట్ తో రైతుల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని కితాబునిచ్చారు.
ఈ బడ్జెట్ తో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధితో ముందుకు దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో వ్యవసాయానికి 24439 కోట్లు, ఎస్సి సంక్షేమానికి 40232 కోట్లు, వైద్య రంగానికి 12393 కోట్లు, బీసీ సంక్షేమనికి 11405 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3591 కోట్లు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, భూపెల్లి రాజు, ఆత్మకూరి కుమార్ యాదవ్, గడ్డం కొమురయ్య యాదవ్, బిరెల్లి మహేష్, మరుపాక రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.