01-04-2025 05:35:04 PM
బైంసా (విజయక్రాంతి): సన్న బియ్యం పంపిణీతో పేదలకు మరింత లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ రేషన్ దుకాణంలో జిల్లా కలెక్టర్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు లాభం చేకూర్చే విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు.
ప్రభుత్వం పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అత్యధిక విలువ గల పోషకాలు, విటమిన్లు ఉంటాయని, వీటి ద్వారా రక్తహీనత, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు. రేషన్ బియ్యాన్ని ప్రజలు ఎవరు దళారులకు అమ్మవద్దని తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ సన్నబియ్యాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. తహసిల్దార్ రాజు, పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్ అసోసియేషన్ సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.