బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ పక్కన కదా ఐదు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం రాత్రి బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఆయన సందర్శించారు. అనంతరం దొంగలు చోరీలకు పాల్పడిన తిలక్ స్టూడియో, పండిత్ మెడికల్ స్టోర్, బాలాజీ ఎలక్ట్రికల్ షాప్, రవీందర్ కిరాణం దుకాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో దొంగల కదలికలపై ఆరా తీశారు.
ఈ సంఘటనలు పెద్దగా నష్టం ఏమీ జరగనప్పటికీ, ఐదు దుకాణాల్లో చోరీకి పాల్పడిన ఘటన కావడంతో సీరియస్ గా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. వ్యాపారులు తమ దుకాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని దొంగతనాలు జరగకుండా నిరోధించుకోవాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలో ని గణపతి మండపాల నిర్వాహకులు శాంతియుతంగా నవరాత్రి వేడుకలను జరుపుకొని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనంలో పోలీసులకు సహకరించాలని కోరారు. సీపీ వెంట బెల్లంపల్లి వన్ టౌన్, టూ టౌన్ సిఐలు ఎన్.దేవయ్య, సయ్యద్ అఫ్జలుద్దీన్ , ఏ ఎస్ ఐ రమేష్, పలువురు పోలీసులు పాల్గొన్నారు.