19-04-2025 11:42:17 PM
కామారెడ్డి (విజయక్రాంతి): జువెలరీ షాపులో చోరీకి పాల్పడ్డ దొంగను అరెస్టు చేసి శనివారం రిమాండ్ పంపినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా పిట్లంలోని నరసింహ జ్యూవెల్లరి షాప్ లో అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. అతని వద్ద 9.732 కిలోల వెండి, 22 గ్రాముల బంగారం స్వాదినం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 07 న రాత్రి జరిగిన దొంగతనం కేసులో నిందితుడుని అరెస్టు చేసి, అతని నుంచి 9.732 కిలోల వెండి, 22 గ్రాముల బంగారం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పిట్లం మండల కేంద్రంలో గల నరసింహ జ్యూవెల్లరి షాప్ దొంగతనంపై బాన్స్వాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ ప్రత్యేక బృందం సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుని కోసం వెతుకుతుండగా అనుమనితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పిట్లంలోని జువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడినట్లు అతడు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడు గతంలో మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం చేయగా మద్నూర్ పోలీస్ స్టేషన్లో cr.no. 51/2024 U/Sec 457, 380 IPC కేసులో జైలుకి వెళ్ళి వచ్చినట్లు తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన బాన్స్వాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్, పిట్లం ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు శ్యామ్, వసి, మహేష్, బాలాజీ, హోమ్ గార్డ్ నాగరాజు లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.