04-03-2025 12:23:23 AM
అందుకే కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఎం వ్యాఖ్యలు
బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకునేందుకు చేసిందేమీ లేదని, అందుకే కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ విమర్శించారు. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లపై సీఎం విమర్శలు చేయడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాం డ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎంకు ప్రజలు అధికారమిచ్చింది పరిపాలన కోసమని.. ఆయనకు పాలన చేతగాక ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి జరిగితే కిషన్రెడ్డి కుళ్లు అంటూ రేవంత్రెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. కిషన్రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన నిధులపై పుస్తకం విడుదల చేశారని, సీఎం అయిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటో రేవంత్రెడ్డి చెప్పాలని డిమాం డ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం తీసుకోవాలిగానీ ఈ తిట్లదండకంతో సాధించేదేమీ లేదన్నారు. ఎస్ఎల్బీసీ కేవలం దుర్ఘటన మాత్రమే కాదని.. ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో పడిందన్నారు.