01-03-2025 12:00:00 AM
మంచి సక్సెస్ సాధించిన ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర బందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కార్యక్రమంలో నార్నే నితిన్ మాట్లాడుతూ.. “మ్యాడ్’కి అద్భుతమైన స్పందన లభించింది. ఈసారి ‘మ్యాడ్-2’ దానికి మించి ఉంటుంది” అన్నారు.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “మీరు టీజర్లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకుమించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం (నవ్వుతూ)” అన్నారు. రామ్ నితిన్ మాట్లాడుతూ.. “మ్యాడ్ సినిమా సమయంలో మాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు.
మొదటి సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు” అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. “మంచి సినిమా తీశాం. ఈ సినిమాలో కథ ఉండదు. పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకుని వెళ్లొచ్చు” అన్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. “మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అయితే దానికి పది రెట్లు ఉంటుంది.
ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది” అన్నారు. నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేము. మ్యాడ్ స్క్వేర్ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ టైటిల్ కి తగ్గట్టుగానే రెట్టింపు వినోదం ఉంటుంది” అన్నారు.