calender_icon.png 8 April, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు

05-04-2025 12:23:13 AM

ఖనిజ సంపదను దోచుకోవడానికే హత్యలు

శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు

రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు

ముషీరాబాద్, ఏప్రిల్ 4: (విజయక్రాంతి): ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు అన్నారు. హత్యలు, నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో పీస్ డైలాగ్ కమిటీ(శాంతి చర్చల కమిటీ) ఆధ్వర్యంలో ‘కేంద్ర ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీ మధ్య చర్చలు’ అనే అంశంపై తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ బి.చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రొఫెనర్ హరగోపాల్, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్, సాధినేని వెంకటేశ్వర్ రావు, జీవన్ కుమార్, గాదె ఇన్నయ్య, చంద్రశేఖర్, ప్రొఫెనర్ తిరుమలి, బాలకీషన్ రావు, తిరుపతి, ప్రొఫెసర్ వినాయక రెడ్డి, ప్రొఫెనర్ అన్వర్ ఖాన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రొఫెనర్ జి. హరగోపాల్ మాట్లా డుతూ నాడు రాజ్యం అమాయక పౌరులను కాల్చి చంపి భూటకవు ఎన్ కౌంటర్లుగా చిత్రికరించిందని ఆరోపించారు.

నేడు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఆదివాసీల ఆధీనంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి అమాయకులైన ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో రాజ్యం హత్యలు చేస్తుందన్నారు. కార్పోరేట్ సంస్థలకు ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని బహిరంగంగా పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయడం దారుణమన్నారు.

ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి కలయిక చర్చలకు అమోదిస్తారా అన్న విషయం అనుమానంగా ఉందన్నారు. చర్చలు ప్రభుత్వం చేస్తుందో, లేదో తెయదు కాని పౌర సమాజం, మేధావులు, కవులు సమాజంలోకి లోతుగా తీసుకువెళ్ళినప్పుడే శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిర్బంధం నేపధ్యంలో చర్చల ప్రతిపాదన వస్తున్నదని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణ వస్తుందనే ఒక ప్రయత్నం జరుగుతుందన్నారు.