17-04-2025 01:05:05 AM
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలతో ప్రపంచానికి తేటతెల్లమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
కంచ గచ్చిబౌలి భూములను, పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన నివేదికతో కండ్లు తెరిపించిందని బుధవారం ఎక్స్ వేదికగా హరీశ్రావు ట్వీట్ చేశారు. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే సభ్యసమాజం, న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోవని ఆయన స్పష్టం చేశారు.
విధ్వంసమే విధానంగా సాగుతోన్న రేవంత్ నిరంకుశ పాలన నాడు హైడ్రా పేరుతో ఇండ్లను కూలిస్తే, నేడు బుల్డోజర్లతో పర్యావరణ హననానికి పాల్పడిందని హరీశ్రావు ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థల మీద గౌరవంతో తమ పార్టీ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చిందని, ఆధారాలతో వాస్తవాలు వివరించామని చెప్పారు.