26-02-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం
విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు
గజ్వేల్, ఫిబ్రవరి25: గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని నాయకులమంతా అధిష్టానం ఆదేశాల మేరకు కలిసిమెలిసి పార్టీ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు అన్నారు. పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గజ్వేల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి అధికార ప్రతినిధులు బండారు శ్రీకాంత్ రావు, నాయిని యాదగిరి లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.
ఎక్కడా లేని విధంగా ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని సూచించారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు, వర్గాలు లేవని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా కలిసి పనిచేస్తామన్నారు.
తాను హరీష్ రావుకు కోవర్ట్ గా పనిచేస్తున్నానని డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి చెప్పడం గురించి స్పందిస్తూ ఆయన ఏదో నోరు జారీ మాట్లాడి ఉండవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తున్న వారెవరో పార్టీకి, ప్రజలకు తెలుసన్నారు. పిసిసి, డిసిసి అధ్యక్షుల సూచనలు స్వీకరిస్తూ పార్టీ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజు, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ములుగు అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, రాచకొండ ప్రశాంత్, నాయకులు అనిల్, మామిడి కృష్ణ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.