టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్30 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ప్రభుత్వమన్నారు.
హైడ్రా కేవలం ఓఆర్ఆర్ పరిధిలో మాత్రమే జరుగుతుందని, సూర్యాపేటకు సంబంధంలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీలోని సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువులకు ఇప్పటికే ఆనకట్టలు కట్టారని, రెండు చెరువు కట్టల బయటనున్న ఇండ్లను కూల్చి వేయరని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వెయ్యి పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు.