calender_icon.png 25 October, 2024 | 12:49 PM

వారి ప్రవర్తన కోపం తెప్పిస్తుంది

25-10-2024 12:00:00 AM

బాలీవుడ్ నటి కృతిసనన్ నటించిన సరికొత్త చిత్రం ‘దో పత్తి’. శశాంక్ చతుర్వేది దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌లో ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కృతిసనన్ బ్రేక్ లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సోదరి నుపూర్ విషయమై మాట్లాడారు.

తనను, తన సోదరిని బంధువులు ఒకేలా చూడరని, తామిద్దరి విషయంలో వారి తీరు వేరుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. “నుపూర్, నేను చాలా సన్నిహితంగా ఉంటాం. ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటాం. ఇటీవలే తెరంగేట్రం చేసిన నుపూర్ నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు యత్నిస్తోంది.

మేమిద్దరం ఒకే రంగంలో ఉండటంతో మా బంధువులు ఇద్దరినీ పోల్చి చూస్తూ నాతో ఒకరకంగా.. నుపూర్‌తో మరోలా ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తన కోపం తెప్పిస్తుంది. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు తను చాలా చిన్నది. తను తెరంగేట్రం చేసి ఎంతో కాలం కావడం లేదు.

అలాంటప్పుడు మా ఇద్దరినీ ఎలా పోల్చిచూస్తారు? నా చెల్లి చాలా స్ట్రాంగ్. ఇలాంటి వాటిని పట్టించుకోదు” అని కృతి సనన్ వెల్లడించారు. నుపూర్ తెలుగులో రూపొందిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కృతి నిర్మాతగా మారగా.. నుపూర్ ‘నోరాహి చెహరా’ కోసం వర్క్ చేస్తున్నారు.