14-04-2025 01:28:15 AM
మేడ్చల్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి, ఆలోచన ఒకటేనని, ఆ పార్టీలకు ఢిల్లీకి మూటలు మోసి సీట్లు కాపాడుకునేవారే కావాలని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం మల్కాజిగిరిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణపై కేసీఆర్కు ఉన్న కడుపునొప్పి ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఉండబోదన్నారు. హైదరాబాద్లో 16 సీట్లు గెలిచినప్పటికీ, జిల్లాల్లో కేసీఆర్ రూ.లక్ష ఇస్తే తాము రూ.లక్షన్నర ఇస్తామని, పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని మాయ మాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంతోషంగా ఉన్నది కేవలం సీఎం రేవంత్ మాత్రమేనని, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధతో ఉన్నారని ఆరోపించారు.
ఈసారి మోసపోకుండా ఓటు వేయాలని కోరా రు. మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే మంచి జరుగుతుందని, రేవంత్రెడ్డి లాంటి చీటర్ను గెలిపించుకుంటే ఏమీ రావని విమర్శించారు. హైదరాబాద్లో 16 నెలల్లో ఒక్క అభివృద్ధి జరగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ 25వ ఏట అడుగిడుతున్న సందర్భంగా వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుంకరి రాజు, రాగిడి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.