calender_icon.png 14 October, 2024 | 8:10 AM

వైన్స్‌లో రూ.10.80 లక్షల చోరీ

14-10-2024 12:56:41 AM

పైకప్పు తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగుడు

నల్లగొండ జిల్లా గుర్రంపోడులో ఘటన 

నల్లగొండ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని వైన్స్‌షాపులో శనివారం అర్ధరాత్రి సినీఫక్కీలో చోరీ జరిగింది. గుర్రంపోడులోని ఆదిత్య వైన్స్‌షాపు నిర్వాహకులు శుక్ర, శనివారం మద్యం విక్రయించగా వచ్చిన నగదును కౌంటర్‌లో దాచారు.

దసరా పండుగ కావడం.. రెండురోజులు భారీగా గిరాకీ ఉండటంతో తీరిక లేక నగదును కౌంటర్‌లోనే ఉంచి రాత్రి దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఓ దుండగుడు శనివారం అర్ధరాత్రి షాపు పైకప్పు రేకులు తొలగించి దుకాణంలోకి దూకి కౌంటర్‌లోని నగదును అపహరించాడు. ఆదివారం ఉదయం నిర్వాహకులు దుకాణం తెరవగా పైకప్పు తొలగించి ఉండటం, కౌంటర్‌లో నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడింది ఒక్కరేనని నిర్ధారించారు. దుండగుడు కౌంటర్ నుంచి నగదు తీసి లెక్కిస్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.