12-12-2024 01:47:12 AM
రంగారెడ్డి, డిసెంబర్11 (విజయక్రాంతి): పౌర విమానయాన రంగంలో భారత్ దూసుకుపోతున్నదని, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అన్నా రు. అందుకే ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్ వైపు మళ్లిందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ‘నోవాటెల్’లో బుధవారం ఆయన ఎయిర్పోర్ట్ ప్రిడెక్టివ్ ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
వరంగల్, భోగాపురం విమానాశ్రయాలను 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన విజన్తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని కొనియాడారు. ఆరోజుల్లో ఎయిర్పోర్ట్ కోసం 5వేల ఎకరాల భూమి సేకరించడం మామూలు విషయం కాదన్నారు. గ్రీన్ఫిల్డ్ ఎయిర్పోర్టుల కాన్సెప్ట్ వెనక చంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు. విమానాశ్రయాలను ప్రజలు కేవలం రవాణాపరం గానే చూడొద్దని, అవి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కేంద్రాలని కితాబునిచ్చారు.
ఐటీ విప్లవం వెనుక చంద్రబాబు కృషి ఉందన్నారు. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే ఆల్ పవర్డ్ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫాం అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలో ఎయిర్ సైడ్, ల్యాండ్ సైడ్, టెర్మినల్ కార్యకలాపాలను ఏకీకృత వ్యవస్థలోకి అనుసంధానిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ వినియోగిస్తున్నామని, డేటా అనలటిక్ సాంకేతికత వినియోగించి సేవలకు అంతరాయం లేకుండా చూస్తామన్నారు.