calender_icon.png 4 October, 2024 | 6:59 AM

ఖైదీల సంక్షేమానికి కృషి హర్షనీయం

03-10-2024 01:17:33 AM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ 

కాప్రా, అక్టోబర్ 2: ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేయడంతో పాటు ఆదాయ వనరులపై దృష్టి సారించడం హర్షనీయమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ పేర్కొన్నారు.

బుధవారం ఖైదీల సంక్షేమ దినోత్స వాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా అడిషనల్ జిల్లా జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి కిరణ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శ్రీదేవి, జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేశ్‌తో కలిసి చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తూ కేంద్ర కారాగారంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న ఖైదీలకు వేతనాలు పెంచడం, జైలు జీవితం అనంతరం స్థిరపడేందుకు ఉపాధి శిక్షణలు ఇవ్వడం అభినందనీయమన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.