17-04-2025 01:13:58 AM
ఐద్వా జిల్లా కార్యదర్శి అత్తిని శారద
సిద్దిపేట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): జ్యోతిరావు పూలే, అంబేద్కర్ యాదిలో జరిగే మహిళా హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న బస్సు యాత్రను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి అత్తిని శారద కోరారు. బుధవారం జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో శారద మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఐద్వ ఆధ్వర్యంలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర సాగుతుందన్నారు. యాత్ర సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 18న చేరుకుంటుందని, 19న పాత బస్టాండ్ వద్ద పూలే, అంబేద్కర్ మహనీయులకు నివాళులర్పించి సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.
రాజ్యాంగంలో స్త్రీలకు సమాన హక్కులు కల్పించినప్పటికీ స్త్రీ, పురుషుల మధ్య అసమానత్వం కొనసాగుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో ఇంకా స్త్రీలు వెనుకబడి ఉన్నారని, కేంద్రంలో బిజెపి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ హక్కుల పరిరక్షణ దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కొరకు ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ చేపట్టిన యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు విగ్నేశ్వరి, నర్సవ్వ , లావణ్య, కవిత, ధరణి తదితరులు పాల్గొన్నారు.