భర్తతో గొడవపడి క్షణికావేశంలో బలవన్మరణం
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 29: భర్తతో గొడవపడి క్షణికావేశానికి గురైన వివాహిత కూతురితో సహా అపార్ట్మెంట్ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం రాత్రి నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని మై హోం అవతార్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపార్ట్మెంట్లోని 18వ ఫ్లోర్లో మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు కృష. ఆది వారం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మానస క్షణికావేశంతో కుమార్తెతో కలిసి అపార్ట్ మెంట్ పైనుంచి కిందికి దూకింది. ఘటనలో తీవ్రగాయాలపాలైన తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం నార్సింగి పోలీసులను సంప్రదించే యత్నం చేయగా స్పందించలేదు.