02-04-2025 12:33:18 AM
రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఏప్రిల్ 1 : నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నాయికోటి బస్తి రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మంగళవారం లాంచనంగా ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం లబ్ధిదారులు, రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రంగారావు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.