calender_icon.png 24 October, 2024 | 11:53 AM

పేదల సంక్షేమానికి పెద్దపీట

06-08-2024 05:08:27 AM

  1. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 
  2. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వికారాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షే మానికి పెద్దపీట వేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. జిల్లాలో రూ.60 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని అలంపల్లి నుంచి రాళ్ల చిటెంపల్లి వరకు రూ.12 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నిర్మాణానికి రూ.6 కోట్లు, మర్పల్లి నుంచి కోట్‌పల్లి వరకు రోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.42 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోరుకుంటుందన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రతిపాదనతో వికారాబాద్ నుంచి తాండూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.48.80 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయ క్, ఎస్‌ఈ వసంత నాయక్, ఈఈ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు.