26-04-2025 12:00:00 AM
భూభారతితో భూముల సమస్యలకు పరిష్కారం
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్, ఏప్రిల్ 25(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. శుక్రవారం మెదక్ మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ , మెదక్ ఆర్డిఓ రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను రైతులు ఎడ్ల బండి ద్వారా ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్వారి వ్యవస్థ ఉండేదని, అప్పుడు సంవత్సరానికి ఓసారి జమాబంది చేసి భూముల వివరాలు పకడ్బందీగా పహణిలో నమోదు చేసేవారని అన్నారు. భూములకు ప్రజలకు హక్కులు లేక ధరణిలో చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధరణి స్థానంలో నూతన చట్టాన్ని తేవడానికి ప్రభుత్వం నిపుణులతో కమిటీని వేసి అన్ని రాష్ట్రాల్లో పరిశీలించి రైతులకు సులువైన చట్టాన్ని అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.