calender_icon.png 9 October, 2024 | 4:47 AM

జమ్ములో విజయం చరిత్రాత్మకం

09-10-2024 02:30:58 AM

గతం కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జమ్ములో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి, బీజేపీ జమ్ముకశ్మీర్ ఇన్‌ఛార్జి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన  ఓ ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని వివరించారు. జమ్మూ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు 100 రోజుల్లో చేసిన అభివృద్ధి ఫలితం హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కనిపించిందని చెప్పారు. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో తాము విజయం సాధించామని తెలిపారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు కూడా సంపాదించనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీ  విజయం సాధించిందని పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించగలిగామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. మోదీపై ప్రజలకున్న విశ్వాసమేంటో జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు స్పష్టంచేశాయన్నారు.

ప్రజల  విశ్వాసంతోనే జమ్మూ ప్రాంతంలోని 43 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిందని, కాంగ్రెస్ ముక్త్ జమ్మూను ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరొకసారి నిరూపించారని ఆయన పేర్కొన్నారు.