calender_icon.png 8 October, 2024 | 2:56 AM

ట్రైన్ ఎపిసోడ్ కొత్త అనుభూతుల్నిస్తుంది

06-10-2024 12:00:00 AM

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల మొదటిసారి కలిసి పనిచేస్తున్న చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల శనివారం మీడియా సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘నేను గేప్ తీసుకున్నా నా శైలి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఫ్రెష్ థీమ్‌తో రావాలని కొంత టైమ్ తీసుకున్నా. గోపీచంద్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. అందుకే ఆయన్ను దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేశా. అభిరుచిగల నిర్మాతలు మాతో కలిశాక మరింత బలం చేకూరింది. ఈ విశ్వంలో చాలా రహస్యాలుంటాయి.. మా ‘విశ్వం’లోనూ చాలా విషయాలుంటాయి.

ఇందులో పాప పాత్ర కీలకంగా ఉంటుంది. కథ ప్రకారం టైటిల్ పెట్టాం. చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ. అందుకే ఛాలెంజ్‌గా తీసుకుని మార్కెట్‌కు అనుగుణంగా డిజైన్ చేశా. ఫైట్స్‌ను రోమ్, మనాలి, గోవాలో సహజంగా తీశాం. ట్రైన్ ఎపిసోడ్ కథకు అవసరం మేరకే పెట్టా. 30 నిముషాల పాటు వెన్నెల కిశోర్, గణేశ్, నరేశ్, కవిత, చమ్మక్ చంద్ర, షకలక శంకర్‌లతో ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే ఈ తీశా. పాన్ ఇండియా వెళితే మంచిదే” అని వివరించారు.