01-03-2025 12:18:33 AM
పెద్దపల్లి , ఫిబ్రవరి- 28: జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహణకు జిల్లాలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 23 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అంతరాయం ఉండవద్దని అన్నారు . విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందిం చాలని, పరీక్ష కేంద్రాలకు త్రాగునీటి సరఫరా ఉండే విధంగా మున్సిపల్, పంచా యతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని, ఉదయం పూట ప్రత్యేక బస్సులను నడపాలని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది , ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ సమా వేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన , ఆర్టిసి, విద్యుత్, పంచాయతీ, మునిసిపల్, పోస్టల్, సంబంధిత ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.