18-03-2025 01:27:51 AM
సూర్యాపేట, మార్చి 17 (విజయక్రాంతి): కస్టమ్ మిల్లింగ్ రైస్పు మిల్లర్లు మొండికేస్తున్నారు. గడువు దాటినా తమకు కేటాయించిన లక్ష్యాన్ని తిరిగి ఇవ్వడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభు త్వం పలుమార్లు గడువులను పొడిగించినా ప్రయోజనం లేకుండా పోతుండటమే కాకుండా జిల్లాలో ప్రతి సీజన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది.
ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ఇవ్వకుండా సొంత వ్యాపారం చేయడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని సమాచారం. 202324 రబీ (యాసంగి)కి సంబంధించి ఇంకా 35 శాతానికి పైగా బియ్యం రావాల్సి ఉంది. మిల్లర్ల వైఖరి కారణంగా జిల్లాలో నాలుగైదు నెలలుగా బియ్యం నిల్వలు లేక.. రేషన్ కూడా ఆలస్యమవుతోంది.
లక్ష్యం 1,62,140 మెట్రిక్ టన్నులు..
202324 రబీ సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి 49 మిల్లులకు ధాన్యాన్ని కేటాయించారు. ఈ ధాన్యాన్ని మూడునెలల లోగా మరాడించి తిరిగి పౌరసరఫరాల శాఖకు అందించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,62,140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ధాన్యాన్ని కేటాయించి ఏడాది కావొస్తున్న లక్ష్యంలో ఇంకా 35 శాతం మేర బకాయి ఉంది.
ఈ బియ్యం రాబట్టేందుకు ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగించినా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మిల్లర్లు మొండికేస్తున్నారు. ఇప్పటి వరకు 1,04,143 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు తిరిగి ఇచ్చేయగా.. మరో 57,997 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడ్డారు.
ముగిసిన గడువు
జిల్లాలో సీఎంఆర్ బియ్యం విషయంలో ప్రతి సీజన్లో మిల్లర్లు మాయాజలం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యాన్ని సమయానికి మర ఆడించి తిరిగి ఇవ్వడం లేదు. ఈ విషయంలో కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమాలు సైతం చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం ఇచ్చిన మూడునెలలకే బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది.
202324 యాసంగి సీజన్కు ఇప్పటివరకు ప్రభుత్వం మూడుసార్లు గడువును పొడిగించింది. అయినా జిల్లాలోని 11 మిల్లులు మాత్రమే పూర్తిస్ధాయిలో బియ్యాన్ని తిరిగి ఇచ్చేశాయి. మిగతా వాటిలో 38 మిల్లులు 90 శాతానికి పైగా ఇవ్వగా.. మరో 11 నుంచి 12 మిల్లుల నుంచి పెద్ద ఎత్తున సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. సీఎంఆర్ బియ్యం సేకరణలో అధికారులు నిత్యం తనిఖీలు, సమీక్షలు చేపడుతున్నా.. మొండికేస్తున్నారు. కాగా ఈ నెల 17తో గడువు ముగిసింది.