calender_icon.png 22 October, 2024 | 4:01 PM

సింగిల్ సిట్టింగ్‌లోనే కథను ఓకే చేశా

31-07-2024 12:13:54 AM

‘తిరగబడరసామీ’ నిర్మాత మల్కాపురం శివకుమార్  

రాజ్‌తరుణ్ హీరోగా తెర మీదికి రానున్న మరో చిత్రం ‘తిరగబడరసామీ’. ఏఎస్.రవికుమార్ దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ మంగళవారం మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. “డైరెక్టర్ గారు ‘తిరగబడరసామీ’ కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశాను. చెప్పిన దానికంటే అద్భుతంగా తీశారు. వెరీ గుడ్ డైరెక్టర్. వ్యక్తులు పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు.. ఈ కథ ప్రకారం రాజ్‌తరుణూ అంతే! క్లాస్‌గా ఉండే తను ఇందులో వైలెన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

మన్నారా చోప్రా నెగెటివ్ ఫీమే ల్ లీడ్ చేస్తోంది. భార్యాభర్తలు మూడు ముళ్ల బంధానికి కట్టుబడి ఉండాలని చెప్పే మూవీ కంటెంట్ చాలా బాగుంటుంది. దాదాపు షూటింగ్ అంతా జహీరాబాద్‌లోనే చేశాం. అది మా నేటివ్ ప్లేస్‌” అని వివరించారు. ఇంకా ఇండస్ట్రీలో తన ప్రయాణం గురించి చెప్తూ.. “కొత్తవారిని పరిచయం చేయాలని భావిస్తుంటాను. గతంలో కార్తిక్ ఘట్టమనేని, త్రిధ చౌదరి వంటి వాళ్లను పరిచయం చేశాం. ఇప్పుడు మాల్వీ మల్హోత్రా మా బ్యానర్‌లోనే హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

మరో కొత్త దర్శకుడితో కూడా సినిమా చేస్తున్నాం. ఆయన పేరు శ్రవణ్. జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ ఆ ప్రాజెక్టులో భాగం కానున్నారు. బాలీవుడ్‌లో మరో కథతో సినిమా చేస్తున్నాం. దానికి నా మిత్రుడు రాజ్ డైరెక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉందా సినిమా. ‘రాహుకేతు’ అనే వెబ్ సిరీస్‌తో పాటు తిరుపతి బాలాజీపై కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం” అని వెల్లడించారు.