* ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని టికెట్లు రెడ్లకేనా?
* కాంగ్రెస్పై జాజుల ఫైర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ కాదని, ఇది రెడ్ల కాంగ్రెస్ అని ఆ పార్టీపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం రెడ్లకే ఇవ్వడమేంటని శనివారం ప్రకటనలో ప్రశ్నించారు. రెడ్లకు టికెట్లు ఇస్తూ కులగణన ఎందుకని అన్నారు.
కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నీటిమీద మూటలేనని ఎద్దేవా చేశారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా కార్పొరేట్ కాలేజీల అధినేత నరేందర్రెడ్డిని ప్రకటించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
గత శాసనసభ, లోకసభ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తామని చెప్పి, చివరికి అతితక్కువ టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. బీసీని పీసీసీ అధ్యక్షుడిగా చేసి టికెట్లు మాత్రం అగ్రకులాలకు ఇవ్వడం దారుణమని చెప్పారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.