29-01-2025 01:52:37 AM
మద్యానికి డబ్బులు ఇవ్వనందుకు ఘాతుకం
కామారెడ్డి, జనవరి 28 (విజయక్రాంతి): మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కొడుకు హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా పోతంగల్ మండలంలోని జల్దిపల్లి గ్రామంలో జరిగింది. జల్దిపల్లి గ్రామానికి చెందిన నేనావత్ రాములు మద్యం సేవించేందుకు తన తల్లి మంగ్లీబాయి(34)ని డబ్బులు ఇవ్వాలని అడిగాడు.
ఆమె నిరాకరించడంతో ఆమె ఒంటిపై ఉన్న నగలపై రాములు కన్ను పడింది. వారం రోజుల క్రితం తల్లిని హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలను కాజేశాడు. మృతదేహాన్ని చెరువుకట్ట వద్ద పడేసి తన తల్లి అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కోటగిరి పోలీసులు రాములపై అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది. మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం కోసం బోధన్ తరలించారు. హత్య వెనుక ఆమె కుమారుడితో పాటు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.