calender_icon.png 27 October, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెచ్చులూడే పైకప్పులు ఊడిపడే ఫ్యాన్లు

16-07-2024 12:48:56 AM

కాకతీయ వర్సిటీలో 4 దశాబ్దాల నాటి హాస్టళ్లు 

శిథిలావస్థకు చేరిన భవనాలు 

పట్టింపులేని పాలకవర్గాలు 

2016లోనే కూల్చివేయాలని నిర్ణయం

బడ్జెట్ లేదని పాత భవనాలే కొనసాగింపు 

ఆందోళనలో హాస్టల్ విద్యార్థులు

వసతి గృహం.. భయంభయం! 

కాకతీయ యూనివర్సిటీలో సమస్యలు రాజ్యమేలుతు న్నాయి. యూనివర్సిటీ ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రధా నంగా ఇక్కడ చదివే విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడో నలభై ఏళ్ల కిందటి.. ప్రస్తుతం శిథిల మైన హాస్టళ్లలో ఉంటున్న విద్యా ర్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. హాస్టళ్లకు ప్రహరీ లేకపోవడంతో కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. గదులకు తలుపులు, కిటికీలు సరిగా లేని కార ణంగా విషపురుగులు లోపలికి ప్రవేశిస్తున్నాయి. పరిసరాలు చెత్తచెదారంతో నిండిపోయాయి. మెస్‌లో నాణ్యమైన భోజనం దొరక్క విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. అధికారుల పట్టింపులేని ధోరణితో విద్యార్థులు నరకయాతన పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

హనుమకొండ, జూలై 1౫ (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూని వర్సిటీగా పేరొందిన కాకతీయ విశ్వవిద్యాలయంలో అడుగడుగునా సమస్యలే దర్శనమి స్తున్నాయి. 1976లో స్థాపించిన ఈ యూనివర్సిటీలో 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యు యేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నా యి. దీని పరిధిలో 13 హాస్టళ్లు ఉండగా మూడు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న 10 హాస్టళ్లలో కేవలం ౮ హాస్టళ్లు సుమారు 40 ఏళ్ల కిందట నిర్మించినవి కావడం గమనార్హం.

ఆ హాస్టళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇటీవల పోతన హాస్టల్‌లోని ఓ గదిలో ఫ్యాన్ ఊడి ఓ విద్యార్థినిపై పడింది. ఆమె తలకు బలమైన గా యం కావడంతో 18 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయం తప్పినప్పటికీ మిగతా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజా గా శుక్రవారం రాత్రి ఇదే హాస్టల్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులు మెస్ లో భోజనం చేస్తున్న సమయంలో హాస్టల్ గదిలోని పైకప్పు పెచ్చులూడి కింద పడ్డాయి. ఫ్యాన్ ఊడి పడిన ఘటన మరిచిపోకముందే గది పైకప్పు పెచ్చులూడి పడటంతో విద్యార్థినులు షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో గదిలో ఉంటే పరిస్థితిని ఊహించుకుని భయాందోళనకు గురువుతున్నారు. 

2016లోనే కూల్చేందుకు నిర్ణయం

యూనివర్సిటీ ప్రారంభంలో నిర్మించిన హాస్టళ్లలో పోతన హాస్టల్ ఒకటి. దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన ఈ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుంది. 2016లోనే దీనిని కూల్చి వేసి కొత్తది నిర్మించాలని అప్పటి వర్సిటీ అధికారులు నిర్ణయించారు. అయితే బడ్జెట్ లేని కారణంగా పోతన హాస్టల్‌ను నిర్వహిస్తున్నట్టు సమాచారం. మొదట్లో ఈ హాస్టల్ బాలురకు కేటాయించగా కొంతకాలం కిం దట బాలికలకు కేటాయించారు. గతంలో ఈ హాస్టల్‌లోకి పాములు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. హాస్టల్ గదిలోకి ప్రవేశించిన ఎలుకలు విద్యార్థుల కాలి వేళ్లు కొరి కాయి. దీంతో అప్పట్లో బాధితులు ఆందోళనకు దిగారు. అనంతరం వర్సిటీ అధికా రులకు ఫిర్యాదు చేశారు. కానీ, అధికారు లు శ్రద్ధ పెట్టని కారణంగా ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఘట నలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నా యనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

తాత్కాలిక ఉపశమనం

పోతన హాస్టల్‌లో జరిగిన వరుస ఘటనలతో అధికారులు నిద్రలేచారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఘటన చోటుచేసుకున్న గదిలో ఉంటున్న విద్యార్థులను సమ్మక్కసారక్క హాస్టల్‌లోకి తరలించారు. కానీ, మిగతా గదుల్లో ఉన్న విద్యార్థులను మాత్రం అక్కడే ఉంచా రు. పోతన హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తులు ఉన్నాయి. ఇటీవల ప్రమాదాలు రెండో అంతస్తులో చోటుచేసుకు న్నా యి. దీంతో అధికారులు ఆ అంతస్తులో వాళ్ల ను మాత్రమే వేరే హాస్టల్‌కి పంపించారు. దీంతో మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్‌లో వరుస ప్రమాదాలు జరుగడం, వసతుల లేమితో ఇబ్బం దులు పడుతున్నారు. మరో ప్రమాదం సంభవిస్తే తమ పరిస్థితి ఏంటని మిగతా వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తమను కూడా సురక్షితమైన హాస్టళ్ల కు మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ఇంచార్జ్ పాలనలో ఆగమాగం 

ఇంచార్జ్ వీసీ పాలనలో యూనివర్సిటీ అస్తవ్యస్తంగా తయారైంది. గత నెల 21న వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రమేశ్ పదవీ విరమణ చేశారు. ఆయన పనిచేసిన కాలంలో యూనివర్సిటీని భ్రష్టు పట్టించారనే ఆరోపణ లున్నాయి. ఆయనపై అనేక అవినీతి ఆరోపణ లు వెల్లువెత్తాయి. ఆయన పదవీ విరమణ తర్వాత ఆ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె పాలనను గాడి లో పెట్టే పని ప్రారంభించారు. వర్సిటీలో 350 కిపైగా అధ్యాపక పోస్టులకు కేవలం 80 వరకు మాత్రమే అధ్యాపకులు ఉన్నారు.

మిగిలిన పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి నెట్టుకొస్తున్నట్టు సమాచా రం. ప్రధానంగా సరిపడా బడ్జెట్ లేని కారణంగా అభివృద్ధి కుంటుపడుతున్నట్టు విమర్శలున్నాయి. సెల్ఫ్ పైనాన్స్ కోర్సుల కింద విద్యార్థులు చెల్లించే ఫీజుల ద్వారానే వర్సిటీ నడుస్తున్నట్టు విద్యార్ధి సంఘాలు చెప్తున్నాయి. ఈ కోర్సులను ఎత్తేస్తే యూనివర్సిటీ నిర్వహణ కష్టసాధ్యమనే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. మెస్ నిర్వాహణ కూడా అధ్వానంగా తయారైందని, పరిసరాలు చెత్తచెదారంతో నిండి కంపు కొడుతు న్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.  హాస్టళ్లలో మరుగుదొడ్లు సరిగా లేక బాలికలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షాకాలం రోడ్డుపై నీరు నిలిచి పరిసరాలు దుర్గంధం వెదజలుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

కొత్త హాస్టళ్లు నిర్మించాలి

40 ఏళ్ల కిందట నిర్మించిన హాస్టళ్లు కావడంతో శిథిలావస్థకు చేరాయి. నాలుగేళ్ల కిందట రెండు పీజీ హాస్టళ్లు నిర్మిం చారు. పాత వాటిలో దాదాపుగా సగానికి పైగా సమస్యల్లోనే ఉన్నాయి. పోతన హాస్టల్‌లో నిత్యం ఏదో ప్రమాదం జరుగు తూనే ఉంది. ఆ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను వేరే హాస్టల్‌కి మార్చాలని పలుమా ర్లు అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ అధికారులు సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ఇటీవల వరుస ఘటనలు చోటుచేసుకున్నా యి. ఒక విద్యార్థినీపై ఫ్యాన్‌ఊడి పడింది. అదృష్టవశాత్తు చిన్న గాయం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నేరుగా తలపై పడితే ఊహించుకోవడానికి భయంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే శుక్రవా రం రాత్రి మరో ఘటన జరిగింది. ఆ రోజు కూడా గదిలో ఎవరూ లేకపోవడంతో  పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.

- నాగరాజు, ఏబీవీపీ నాయకుడు