22-03-2025 12:43:14 AM
బీజేపీ కరీంనగర్ నగర విస్తృత స్థాయి సమావేశంలో నేతలు
కరీంనగర్, మార్చి 21 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రమిచ్చిన స్మార్ట్ సిటీ హోదాతో కరీంనగర్ రూపురేఖలు, ముఖచిత్రం మారిపోయిందని, దాదాపు 800 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని , కరీంనగర్ ని అభివృద్ధి చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ కే దక్కుతుందని అన్నారు.
ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.
ఇటీవలే కేంద్రమంత్రి కట్టర్ చేతుల మీదుగా అమృత్ పథకం కింద కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ లో 24 గంటల మంచినీటి సదుపాయాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, త్వరలో కరీంనగర్ పట్టణ వ్యాప్తంగా ప్రజలకు 24 గంటల మంచినీటి సౌకర్యాన్ని అందించడం కోసం కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ తగిన కృషి చేస్తున్నారన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పై కాషాయ జెండా రెపరెపలాడే లక్ష్యంతో బిజెపి శ్రేణులంతా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, డి శంకర్, మాజీ జిల్లా అధ్యక్షులు బాసర సత్యనారాయణ రావు, మాజీ డిప్యూటీ మేయర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, కోమల ఆంజనేయులు, బంగారు రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.