అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, అడవుల సంరక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలకు విలువ కట్టలేమని అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం నెహ్రూ జువాలాజికల్ పార్క్లోని అమరుల స్మారక చిహ్నం వద్ద అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి ఆర్ఎం డోబ్రియల్, ఇతర సిబ్బందితో కలిసి పొదెం వీరయ్య నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సందేశాలను చదివి వినిపించారు. అనంతరం పొదెం వీరయ్య మాట్లాడుతూ.. అడవులకు, ఆదివాసీలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తాను కూడా ఒక ఆదివాసీ బిడ్డనేనని అన్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఈలు సింగ్, పీసీసీఎఫ్ సువర్ణ, ఇతర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.