గజ్వేల్ (విజయక్రాంతి): దేశ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ యూనియన్ (ఎస్జీటీయు) ప్రాంతీయ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసిందన్నారు. డీఎస్సీ ద్వారా 11 వేల ఉపాధ్యాయులను నియామకం చేసిందన్నారు.
గురుకులాల్లో నియామకాలు పూర్తి చేసిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందని, స్కావెంజర్ లను నియమించిందన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ విధులను పటిష్టంగా నిర్వహించి విద్యారంగాన్ని బలోపేతం చేసి ప్రభుత్వంకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్ రామచంద్ర చారి, నాయకులు భిక్షపతి, యూనియన్ నాయకులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, మంజుల రెడ్డి, సంధ్య, సంగీత, మోహినుద్ధిన్, సురేష్, నరసింహ, నరేష్, నాగరాజు, కరుణాకర్, సంతోష్ గోపాల్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.