05-03-2025 12:00:18 AM
జీఎస్ఐ రిటైర్డ్ సీనియర్ అధికారి డాక్టర్ ఎం. రామకృష్ణన్
ఘనంగా జీఎస్ఐ 175 వ వార్షికోత్సవం
ప్రపంచంలోనే రెండో పురాతనమైన సంస్థగా ఘనత
ఎల్బీనగర్: భారత ప్రభుత్వం, గనుల మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) 175వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాగోల్.. బండ్లగూడలోని జీఎస్ఐటీఐ కార్యాలయం ఎంఎస్ కృష్ణన్ ఆడిటోరియంలో జీఎస్ఐ సౌత్రీజియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, విభాగాధిపతి ఎస్డీ పట్బాజే, సంస్థ అనుబంధ రంగాల ప్రముఖులు, పరిశోధకులు, విద్యావేత్తలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. జీఎస్ఐ ట్రైనింగ్ సెంటర్ డిఫ్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్ రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీఎస్ఐ వ్యవస్థాపకులు, మార్గదర్శకులకు నివాళి అర్పించారు.
అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జీఎస్ఐ రిటైర్డ్ సీనియర్ డిఫ్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం. రామకృష్ణన్ మాట్లాడుతూ.. భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ(జీఎస్ఐ) 1851లో స్థాపించారని, 175 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే రెండవ అతి పురాతన, అతిపెద్ద సంస్థగా చెప్పారు. దేశ నిర్మాణంలో సంస్థ పాత్రను ఆయనకొనియాడారు. ఇటీవల భూశాస్త్ర అధ్యయనాలు, ఖనిజ పరిశోధనలలో జీఎస్ఐ సాధించిన విజయాలను గుర్తు చేశారు. భవిష్యత్లో జీఎస్ఐ పరిధిని విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. అడిషనల్డైరెక్టర్ జనరల్, విభాగాధిపతి ఎస్డీ పట్బాజే మాట్లాడుతూ.. 1851లో రైల్వేల కోసం బొగ్గును కనుగొనడం నుంచి జీఎస్ఐ పాత్ర ప్రారంభమైందన్నారు. అత్యాధునిక భౌగోళిక శాస్త్ర ఆవిష్కరణలలో అగ్రగామిగా నేటి వరకు జీఎస్ఐ పరిణామాన్ని వివరించారు. ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి అధిక -నాణ్యత ప్రమాణాలను నిర్వహించడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను స్వీకరించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. జాతీయ అభివృద్ధి కోసం ఖనిజ వనరుల అన్వేషణను పెంచడంలో జీఎస్ఐ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
అనంతరం జీఎస్ఐ మార్గదర్శకంగా నిలిచిన నాయకులను సత్కరించారు. వారు జీఎస్ఐ ద్వారా దేశ నిర్మాణానికి చేసిన అమూల్యమైన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా, జీఎస్ఐ వివిధ ఖనిజాలు, రాతి, శిలాజ నమూనాలను ప్రదర్శించే ప్రదర్శన స్టాల్ చూపరులను ఆకట్టుకుంది. వివిధ సంస్థల నుంచి విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్, సీనియర్అధికారులు డాక్టర్ ఎన్. కుటుంబరావు, ఎం. రాజు, కె. శశాంక, పీకే శర్మ, బీఆర్వీ సుశీల్ కుమార్, బి. శ్రీనివాసరావు, కేవీ సుబ్బారావు , ఎల్పీ సింగ్, ఎస్ఎన్ మహాపాత్రో , ఎ. ఆచార్య, ఎంఎన్ప్రవీణ్, కేవీ మారుతీ , సంస్థ సిబ్బంది భారీ సంఖ్యలో దాదాపు 800 మంది పాల్గొన్నారు.