31-03-2025 12:00:00 AM
రెస్క్యూ బృందాల నిపుణులతో సమీక్షలు.
మరింత వేగం పెంచిన మట్టి తీత పనులు
నాగర్ కర్నూల్ మార్చి 30 (విజయక్రాంతి) శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో మిగతా ఆరుగురి కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం ఉగాది రోజు కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. డేంజర్ జోన్ డి-1, డి-2 వద్ద పలుమార్లు కార్మికుల ఆనవాళ్ళ కోసం ఎస్కవేటర్ జెసిబిల సాయంతో మట్టి తీత పనులు జరుపగా ప్రస్తుతం ఆ మట్టి తీత పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయి.
కన్వేయర్ బెల్ట్ ద్వారా నిర్విరామంగా మట్టిని బయటికి తీస్తున్నారు. టిబిఎం యంత్రంలో చిక్కుకొని ఉన్న లోకో ట్రైన్ భోగిలను కూడా బయటికి తరలించారు. ఇండియన్ రైల్వే రెస్క్యూ బృందాల చేత ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా టిబిఎమ్ యంత్రాలను తొలగిస్తూ వాటి ముక్కలను లోకో ట్రైన్ ద్వారా బయటికి చేరవేస్తున్నారు.
చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల్లో ఇద్దరినీ ఇప్పటికే వెలికితీయగా మరో ఆరు మంది కార్మికుల ఆచూకీ కోసం నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి రెస్క్యూ బృందాల నిపుణులతో ప్రత్యేక సమావేశమయ్యారు.