calender_icon.png 7 October, 2024 | 10:54 PM

ఎర్రకండువా సీన్ హైలైట్ అవుతుంది

06-10-2024 12:00:00 AM

హీరో వరుణ్‌తేజ్ నటించిన తాజా చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 14న విడుదల కానున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ శనివారం అభిమానుల మధ్య విడుదల చేశారు.

విజయవాడ రాజ్‌యువరాజ్ థియేటర్‌లో జరిగిన ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్.. అభిమానుద్దేశించి మాట్లాడారు. “అమ్మవారి దీవెనలు కోరుకుంటూ మీ అందరి చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. 1960లో వైజాగ్‌లో జరిగే కథ ‘మట్కా’. ఈ సినిమాలో నేను మార్కెట్‌లో పనిచేసే కూలిగా కనిపిస్తా.

ఓ ఫైట్ సీన్‌లో ఏదో మిస్ అవుతుందే అనుకుంటుండగా టెక్నికల్ టీమ్‌లో ఒకతను ఎర్రకండువాను నా మెడలో వేశారు. సినిమాలో అదే హైలైట్ అవుతుంది. టీజర్ చివరిలో నా భుజం మీద ఎర్రతుండు పడుతున్న సీన్ అదే. ‘మట్కా’ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది” అన్నారు. కార్యక్రమంలో దర్శక నిర్మాతలతోపాటు కెమెరామెన్ కిషోర్‌కుమార్ కూడా మాట్లాడారు. పలువురు మూవీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.