calender_icon.png 4 May, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లును కుదిపేసిన వాన

17-04-2025 12:00:00 AM

  1. మానుకోటలో వర్షానికి తడసిన ధాన్యం, మక్కలు 
  2. ఇనుగుర్తిలో విద్యుత్ తీగ తెగిపడి వృద్ధురాలు మృతి
  3. మరో రెండు రోజులు వర్ష సూచన 

మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో సారి అకాల వర్షాలు కుదిపేసాయి. గతవారం కురిసిన అకాల వర్షానికి పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినగా మళ్లీ మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు యాసంగి పంటలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. అత్య ధికంగా మహబూబాబాద్ జిల్లాలో 195.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. యాసంగిలో సాగుచేసిన ధాన్యం, మక్కజొన్న పంటలకు అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించింది.

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తెచ్చిన ధాన్యం, మక్కలు వర్షానికి తడిసి ముద్దగా మారాయి. గాలి వానలకు పంట ఉత్పత్తులపై కప్పుకున్న టార్పాలిన్లు ఎగిరిపోవడం తో పాటు వర్షానికి వచ్చిన వరదకు పలుచోట్ల పంటలు నీటిపాలయ్యాయి. ఇనుగుర్తి మండల కేంద్రంలో గాలివానకు విద్యుత్తు లైను తెగిపడగా, అది గమనించకుండా అడుగేసి విద్యుత్ ఘాతానికి నాగెళ్ల ఉప్పలమ్మ (65) అనే వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది.

అలాగే ఉమ్మడి వరం గల్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల అకాల వర్షాలు కురిసాయి. మరో రెండు రోజులపాటు వర్ష సూచన ఉండడంతో రైతులు పంటలను కాపాడుకోవడం ఎలా అంటూ ఆవేదన చెందుతున్నారు. యాసంగి పంటలు చేతికందే దశలో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. 

అయ్యో అన్నదాత

మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి గాలి వాన బీభత్యాన్ని సృష్టించింది. జిల్లావ్యాప్తంగా 195.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యధికంగా డబ్బులు పేట మండలంలో 38.2, గూడూరులో 28.2, బయ్యారంలో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. వివిధ గ్రామాల్లో అకాల వర్షం వల్ల మరోసారి పంటలకు తీవ్ర నష్టం కలిగించింది.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను కేసముద్రం మార్కెట్ కు తెచ్చి యార్డులో ఆరబెట్టి తెల్లవారితే విక్రయించేందుకు సిద్ధం చేసిన మొక్కజొన్న, ధాన్యం మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి పోయాయి. తెల్లారితే విక్రయించి నగదుతో ఇంటికి వెళ్తామనే ధీమాతో ఉన్న అన్నదాతలు వర్షానికి తమ పంట ఉత్పత్తులు తడవకుండా కాపాడుకోవడానికి పడ్డపాట్లు చెప్పనలవి కానివి.

వర్షానికి ధాన్యం, మక్కల రాశులపై కప్పుకున్న టార్పాలిన్లు గాలికి ఎగిరిపోవడంతో ఓపెన్ యార్డు లో పోసుకున్న ధాన్యం, మక్కలన్ని దాదాపుగా తడిసిపోయాయి. మంగళవారం రాత్రంతా పంట ఉత్పత్తులను వర్షానికి దెబ్బతినకుండా కాపాడుకునే ప్రయత్నంలో రైతులు జాగారం చేయాల్సి వచ్చింది.

తడిసి న ధాన్యం, మక్కలను తిరిగి ఆరబెట్టి.. విక్రయించడానికి మళ్లీ మార్కెట్లోనే నాలుగైదు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాగా తడిసిన ధాన్యం, మక్కలకు ఆశించిన ధర కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని, ఎంతో కష్టపడి అందించిన పంటను అకాల వర్షం ‘నోటికాడి బుక్క’ లాగేసుకున్నట్లు చేసిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

అలాగే పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో విక్రయానికి తెచ్చిన దాన్యం తడిసిపోయింది. మరి కొన్నిచోట్ల నూర్పిడి చేసిన వరి కల్లాలు వర్షానికి తడిసి పోయాయి. పక్షం రోజుల్లోనే రెండుసార్లు అకాల వర్షం రావడంతో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగి ల్చింది. దెబ్బతిన్న పంట ఉత్పత్తులను ప్రభు త్వం మద్దతు ధరకు కొనుగోలు చేసిన చర్య లు తీసుకోకపోతే తమ పరిస్థితి అగమ్య గోచరమేనని రైతులు చెబుతున్నారు.