21-02-2025 01:24:05 AM
మూడు గంటల పాటు ప్రయాణికుల నరకయాతన
పోలీసుల వైఫల్యం
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): జిల్లాలోని తాడూరు మండలం గుంతకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలకపల్లి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన శేఖర్(31) శ్రీనివాసులు(42) ఇద్దరు మృతి చెందగా గురువా రం బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో జిల్లా సగర సంఘం నేతలు మద్దతునిస్తూ ప్రధాన రహదారిపై బైటాయించారు. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన నిరసనతో ప్రయాణికులు, వాహనదారులు నరకయాతన అనుభవించారు.
నిరసనకు దిగుతున్నట్లు పోలీసులకు ముందే సమాచారం ఉన్నా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయడం లో మాత్రం విఫలమయ్యారు. మెయిన్ బస్టాండ్ నుంచి బస్ డిపో దాకా వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడి కనీసం అంబులెన్స్ కు కూడా దారి ఇవ్వలేకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇతర ప్రాంతాలకు వాహనాలు మళ్ళించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్థానిక పోలీసులకు మొట్టికాయలు వేయడంతోనే పోలీసులు బాధితుల పక్షాన నిల బడి వారికి భరోసా ఇవ్వడంతోనే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.