11-04-2025 12:00:00 AM
వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
వరంగల్, ఏప్రిల్10 (విజయక్రాంతి): అన్నిరకాల అనుమతులతోనే కరాణీ స్త్స్రసెస్ కంపెనీ నిర్వహిస్తున్నారని, కంపెనీపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 33 ఏళ్ల క్రితం జాన్పాక పంచాయతీ పరిధిలో పంచాయతీ, పరిశ్రమలశాఖ, పొల్యూషన్ బోర్డ్, కార్మిక తదితర శాఖల అనుమతులతో యాజమాన్యం కంపెనీ ప్రారంభించిందని పేర్కొంది.
సామాజిక బాధ్యత, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ స్పుసైస్ పరిశ్రమగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిందని తెలిపారు. దేశ విదేశాల ప్రతినిధులు ఈ కంపెనీని సందర్శించి, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అభినందించినారని గుర్తుచేసింది. దేశవిదేశాలకు ఉత్తమ స్పుసైస్ ఎగుమతి చేస్తూ వరంగల్ జిల్లాకే తలమానికంగా నిలిచిందని పేర్కొంది.
కరోనా కష్టకాలంలో సీఎం, పీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున విరాళాలు అందించి సామాజిక బాధ్యతను నెరవేర్చిందని ప్రశంసించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అత్యవసర సమయాల్లో మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేసిందని వివరించింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ, పొల్యూషన్, పరిశ్రమల శాఖల లైసెన్సులను గడువు లోపల నవీకరించుకుంటుందని వెల్లడించింది.
ఈ పరిశ్రమ వల్ల జాన్పాకలోని చాలామంది మహిళా కార్మికులు, యువత, రైతులకు మేలు జరుగుతున్నదని స్పష్టంచేసింది. ఈ పరిశ్రమ నుంచి ఎలాంటి వ్యర్థాలు వెలువడకున్నా పరిశ్రమ వల్ల అసౌకర్యం కలుగుతున్నదని పలువురు వినతి పత్రాలు సమర్పించడం సమంజసం కాదని అన్నది. కొత్తపేట రోడ్లో నూతనంగా నిర్మించే పరిశ్రమ పూర్తయ్యాక ఈ కంపెనీని తరలిస్తామని తెలిపింది.