మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని రెండవ కు చెందిన పదవ తరగతి విద్యార్థి ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థి ఆచూకీ కనుకొని క్షేమంగా ఇంటికి చేర్చారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని రెండవ జోన్ కు చెందిన 10వ తరగతి విద్యార్థి తంగిళ్ళ సాత్విక్ (17) సోమవారం సాయంత్రం ఇంటి నుండి ట్యూషన్ కు వెళ్ళి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పట్టణంలో గాలించి ఆచూకీ దొరకక పోవడంతో తీవ్ర భయాందోళనలకు గురై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఎస్ఐ తక్షణమే పోలీసు అధికారులను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేయడంతో పాటు బ్లూ కోర్స్ సిబ్బందితో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అంతేకాకుండా పోలీస్ అధికారులు విద్యార్థి వివరాలతో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో విస్తృతంగా ప్రచారం చేయగా మంచిర్యాల పట్టణంలోని ఆటో యూనియన్ వారు సోషల్ మీడియాలోని వచ్చిన కథనాన్ని చూసి విద్యార్థిని గుర్తుపట్టి అర్ధరాత్రి 2గంటల సమయంలో పోలీస్ అధికారులకు అప్పగించారు. పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. విద్యార్థిని క్షేమంగా ఇంటికి చేర్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనప్పటికీ తప్పిపోయిన విద్యార్థిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించేలా కృషి చేసిన పోలీసులను పలువురు అభినందించారు.