calender_icon.png 4 October, 2024 | 6:59 AM

మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్

11-09-2024 12:00:00 AM

  1. స్వాధీనం చేసుకున్న బైక్ తిరిగివ్వాలని పోలీసులతో వాగ్వాదం
  2. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్న వైనం
  3. మంటలార్పిన పోలీసులు, ఆసుపత్రికి తరలింపు

రాజేంద్రనగర్, సెప్టెంబర్10: డ్రంక్ అం డ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఓ వ్యక్తి.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో కలకలం రేపింది.  పోలీసులు తెలిపిన వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వడ్డేమాన్ గ్రామానికి చెందిన శివ (25) కొంతకాలంగా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని కింగ్స్ కాలనీలో ఉంటూ లేబర్ పని చేస్తున్నాడు.

మంగళవారం పూటుగా మద్యం తాగి శివ శంషాబాద్ వైపు నుంచి తొండుపల్లి గేట్ వైపు వెళ్తుండగా.. శంషాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో డ్రం కెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. శివకి బ్రీత్ అనలైజర్‌తో టెస్టు చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ జరిగింది. 157 పాయింట్లు వచ్చింది. దీంతో పోలీసులు అతడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులతో వాగ్వాదం..

తనకు ఇప్పటికిప్పుడు బైక్ తిరిగి ఇవ్వాలని శివ పోలీసులను బెదిరించాడు. అయితే మద్యం తాగని మరో వ్యక్తిని తీసుకువస్తే బైక్ ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన శివ కొద్దిదూరం వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే మంటలు ఆర్పి.. శివను శంషాబాద్‌లోని లిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

శంషాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజు ఫిర్యాదు మేరకు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శివ గతంలోనూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసినట్లు సమాచారం.