మంత్రి సీతక్క సూచన
జయశంకర్ భూపాలపల్లి (ములుగు), జూలై 21(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం ములుగు మండలం జాకారం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు వరద ఉధృతిని ఆమె పరిశీలించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అందుబాటులో ఉండి చూడాలని ఆమె సూచించారు.