calender_icon.png 28 September, 2024 | 3:06 PM

ప్రేమించిన వాడే కడతేర్చాడు

26-09-2024 03:01:22 AM

బావతో కలిసి ప్రియురాలిపై లైంగికదాడి 

ఆపై గొంతు నులిమి హత్య

పుట్టలగడ్డ తండాలో యువతి అనుమానాస్పద మృతిపై వీడిన మిస్టరీ 

నల్లగొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ తండాలో యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితోపాటు అతడి సొంత బావ యువతిపై అత్యాచారం చేసి గొంతు నులిమి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు.

ప్రియుడితోపాటు అతడి బావ, సహకరించిన తల్లిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిర్యాలగూడ పట్టణం లోని తన కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు మీడియాకు కేసు వివరాలు వెల్లడిం చారు. దామరచర్ల మండలం పుట్టలగడ్డ తండాకు చెందిన రూపావత్ నాగు అదే గ్రామానికి చెందిన యువతి (19) ప్రేమించుకున్నారు.

ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో నాగును నిలదీసి కూతురును పెళ్లి చేసుకోవాలని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో ప్రియురాలి అడ్డు తొలగించుకోవాలని భావించిన నాగు ఆమె ను నమ్మించి ఈ నెల 14న పథకం ప్రకారం ఊరు శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అప్పటికే నాగు బావ క్రాంతి, తల్లి బుజ్జి  అక్కడికి చేరుకున్నారు. తల్లిని కాపలాగా ఉంచి నాగు అతడి బావ క్రాంతి యువతిపై లైంగికదాడి చేశారు. ఆ తరువాత గొంతు నులిమి చంపి చెట్టుకు ఉరివేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో వాస్తవా లు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.