09-04-2025 01:10:55 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 8 (విజయక్రాంతి,) జిల్లాలో పోషణ పక్షం ( పోషణ పక్వాడ ) కార్యక్రమాన్ని అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణలో భాగంగా పోషణ పక్షాన్ని ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ లక్ష్యం ప్రధానంగా బలహీనంగా, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు , కౌమారదశలో ఉన్న బాలికలను గుర్తించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరమన్నారు. పోషణ లోపం నివారణలో భాగంగా ఏ గ్రామంలోనూ పోషక లోపం ఉండకుండా చేయాలనే ప్రధాన భావంతో విజయవంతం చేసి పరిపూర్ణ ఆరోగ్యవంతం తయారు చేయాలన్నారు. వైద్యశాఖ అధికారులు జిల్లాలో పోషక లోపం ఉన్న గర్భిణీల వివరాలను ఐసిడిఎస్ వారికి అందించాలని, వారు వారికి సరైన పోషక ఆహారం అందించాలని ఆదేశించారు.
ఈ విధంగా ఐసిడిఎస్ వారు పోషకాహార లోపం, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లల వివరాలను వైద్య శాఖ అధికారులకు అందించాలని, వారు వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాల న్నారు.ఈ పోషకాహార మేళాలో భాగంగా, వివిధ రకాల పోషకాహార వంటకాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ వంటకాలు గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడేలా రూపొందించాలని తెలిపారు.అనంతరం పోషణ పక్షం వాల్ పోస్టర్ ను కలెక్టర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళ సంక్షేమ అధికారి లేనినా, వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు