20-03-2025 02:11:40 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నాగార్జున సాగర్, మార్చి 19 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు, ఓపీ, స్టేరిలైజేషన్ రిజిస్టర్లను పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీని పెంచాలని, ప్రతి రోగి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు.
గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని, మాతాశిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీ భవనం శిథిలావస్థలో ఉందని, మరమ్మతులు లేదా కొత్త భవనం నిర్మించాలని వైద్యాధికారి కోరగా సానుకూలంగా స్పందించారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డుల దరఖాస్తుల అప్లోడింగ్ పరిశీలించారు. అంతకుముందు స్థానిక కేజీబీవీకి వెళ్లి వంటగది, స్టోర్రూమ్, సరుకులు, కిచెన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులను సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలడిగి అభ్యసన సామర్థ్యాలు పరిశీలించారు.