calender_icon.png 20 October, 2024 | 9:04 AM

వీడిన వృద్ధ దంపతుల హత్య మిస్టరీ

20-10-2024 02:09:10 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 19: మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును రాచకొండ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఎల్బీనగర్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. కొత్తగూడలోని ఓ ఫాంహౌస్‌లో మూగ శాంతమ్మ (65), ఉషయ్య (70) దంపతులు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. గత గురువారం రాత్రి 9 గంటల సమయంలో వారు హత్యకు గురయ్యారు. దీనిపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక ఫోన్ కాల్ నిందితుడిని పట్టించింది.

నిందితుడిని కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివకుమార్‌గా గుర్తిచారు. శివకుమార్ తాగిన మత్తులో జనసంచారం లేని ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి తాగడానికి నీళ్లు అడిగాడు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న అతను శాంతమ్మపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటిం చడంతో కొడవలితో నరికాడు.

అప్పుడే ఉషయ్య ఇంటికి రాగా, హత్య విషయం బయటకు వస్తుందని అతడిని కూడా వెంబడించి కత్తితో నరికి చంపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. శివకుమార్ తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి చేయడానికి వెళ్లే ముందు తాను వాడే ఫోన్‌ను స్విచ్చాఫ్ చేస్తాడు. వృద్ధ దంపతులను చంపిన తర్వాత తన ఫోన్‌ను ఎవరైనా ఆన్ చేశారా అనే అనుమానంతో వారి ఫోన్ నుంచి తన నంబర్‌కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు సాంకేతికతను వాడి నిందితుడిని గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేశారు. 

మరో మహిళను 

హత్య చేసిన శివకుమార్

కాగా, 2023 మే నెలలో కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన శైలజారెడ్డి (42)ని హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులకు అక్కడ వేలిముద్రలు తప్పా ఇతర ఏ ఆధారాలు లభించకపోవడంతో కేసు పెండింగ్‌లో ఉన్నది. అయితే, వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమార్ వేలిముద్రలు.. శైలజారెడ్డి హత్య కేసులో సేకరించిన వేలిముద్రలు ఒక్కరివే కావడంతో ఆమెను హత్య చేసింది కూడా శివకుమార్ అని నిర్ధారించారు. ఆ హత్య తానే చేశానని శివకుమార్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై లైంగిక దాడికి యత్నించగా, ప్రతిఘటించడంతో కత్తితో నరికి చంపాడు. ఈ మేరకు శివకుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. 

* తాగిన మత్తులో వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నం

* ప్రతిఘటించడంతో ఇద్దరిని హత్య చేసిన నిందితుడు