calender_icon.png 21 September, 2024 | 1:49 PM

అదృశ్యమైన మహిళ దారుణ హత్య

21-09-2024 01:36:42 AM

చేగుంట, సెప్టెంబర్ 20: అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైన ఘటన చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి శుక్రవారం చేగుంట పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చేగుంట మండలం చెట్లతిమ్మా యిపల్లి సాజుతండాకు చెందిన మాలోత్ లలిత (48) ఈనెల 11న మాసాయిపేట బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. కానీ తిరిగి రాకపోవడంతో ఆమె కూతురు జరుపుల దేవి ఫిర్యాదు మేరకు 14న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రామాయంపేట సీఐ వెంకట్ రాజుగౌడ్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ ఒక టీంగా ఏర్పడి విచారించగా తూప్రాన్ మండలం ఘణపురం గ్రామానికి చెందిన పాత నేరస్తులైన వల్లపు కనకయ్య, వడ్డె కనకయ్య, వల్లెపు ప్రమీల, వడ్డె ప్రమీల తూప్రాన్ కల్లు దుకాణంలో మృతురాలికి పరిచయమైనట్లు తెలిపారు.

మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచేయాలని పథకం ప్రకారం ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ఈనెల 11న ఆమెకు ఫోన్ చేసి యాదగిరిగుట్టకు వెళ్దామని, నగలు పెట్టుకొని రావాలని చెప్పారు. తూప్రాన్‌కు వచ్చిన లలితను బైక్‌పై తీసుకొని జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసి ఆభరణాలను దోచుకొని పారిపోయారు. గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.